ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండటంతో ఆర్టీసీలో చనిపోతున్న కార్మికుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. అయితే సంగారెడ్డిజిల్లా జోగిపేటకు చెందిన పులబోయిన నాగేశ్వర్ (45)ను దురదృష్టం మరోరకంగా వెంటాడుతోంది. గడువులోగా విధులలో చేరని వారందరూ ఉద్యోగాలు కోల్పోయినట్లేనని, వారితో ఇక ప్రభుత్వానికి, ఆర్టీసీకి ఎటువంటి సంబందమూ ఉండబోదని సిఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో అతను ఉద్యోగం పోయిందనే ఆందోళన, తీవ్ర మానసిక ఒత్తిడికి గురవడంతో మతిస్థిమితం కోల్పోయారు.
“డిస్మిస్ అయినం... డిస్మిస్ అయినం...”అంటూ రాత్రి పగలు పెద్దగా ఏడుస్తున్నాడని కాసేపు నవ్వుకొంటున్నాడని అతని భార్య సుజాత తెలిపారు. అతని పరిస్థితి చూసి ఆందోళన చెంది వెంటనే హైదరాబాద్ తార్నాక ఆర్టీసీ ఆసుపత్రికి తీసుకువెళ్లమని కానీ సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు చికిత్స చేయలేమని చెప్పి తిప్పి పంపించేశారని ఆమె తెలిపారు. ఈ పరిస్థితులలో ఏమి చేయాలో పాలుపోక మతి స్థిమితం తప్పైన భర్తను, తన ఇద్దరు కొడుకులను తీసుకొని జోగిపేటలోని తన పుట్టింటికి వచ్చేశానని సుజాత తెలిపారు. సెప్టెంబర్ జీతాలు కూడా అందకపోవడంతో కుటుంబం గడవటం చాలా కష్టంగా ఉందని కన్నీళ్లు పెట్టుకొన్నారు.