టీఎస్ఆర్టీసీ మాజీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ సిఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని చెప్పి ఆర్టీసీని ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనుకోవడం సరికాదు. ప్రైవేట్ బస్సులైతేనే లాభసాటిగా నడుస్తాయనే కేసీఆర్ వాదన కూడా సరికాదు. ఒకవేళ ప్రైవేట్ బస్సులకు కూడా నష్టాలు వస్తే అప్పుడు ఏమి చేస్తారు? వాటినీ మూసేస్తారా? ఒకవేళ అవి నష్టాలను అధిగమించడానికి టికెట్ ధరలు పెంచాలనుకొంటే తెరాస సర్కార్ కాదనగలదా? నష్టాలు లేకుండా, టికెట్ ధరలు పెంచకుండా ప్రైవేట్ బస్సులను నడిపించగలరా? ఒకవేళ అలా నడిపించి చూపిస్తే నేను గుండు గీసుకోవడానికి సిద్దం. నడిపించలేకపోతే వచ్చే ఎన్నికలలో సిఎం కేసీఆర్ పోటీ చేయకుండా ఉంటారా?” అని సవాల్ విసిరారు.
టీఎస్ఆర్టీసీ మాజీ ఛైర్మన్గా పనిచేసిన అనుభవం ఉన్న సోమారపు సత్యనారాయణ ప్రజలను ఆకట్టుకోవడానికి ఇటువంటి సవాళ్ళు విసిరేబదులు ఆర్టీసీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి, వాటికి పరిష్కారాల గురించి నిర్మాణాత్మకమైన సలహాలు ఇచ్చి ఉండి ఉంటే బాగుండేది. ఆర్టీసీ కార్మిక సంఘాలకు, ప్రభుత్వానికి మద్య ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించడానికి ఏవైనా మంచి సలహాలు ఇచ్చినా అందరూ హర్షించేవారు.
కొండను వెంట్రుకతో మూడేసి లాగితే వస్తే కొండవస్తుంది లేకుంటే పోయేది వెంట్రుకే కదా అన్నట్లుంది ఆయన సవాలు. ఆయన ఓడిపోతే గుండు గీయించుకొంటారట కానీ ప్రైవేట్ బస్సులు టికెట్ పెంచితే కేసీఆర్ వచ్చే ఎన్నికలలో పోటీ చేయకూడదట!