హుజూర్నగర్ ఉపఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు తెరాస సర్కార్ హుజూర్నగర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు మంగళవారం ప్రాధమిక ప్రకటన విడుదల చేసింది. దీనిపై ప్రజలు తమ అభ్యంతరాలను, సలహాలు, సూచనలను సూర్యాపేట జిల్లా కలెక్టరుకు 30 రోజులలోగా లిఖితపూర్వకంగా తెలియజేయవచ్చు. రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి సోమేష్ కుమార్ మంగళవారం ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
సూర్యాపేట జిల్లాలోని 7 మండలాలతో హుజూర్నగర్ రెవెన్యూ డివిజన్ను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం కోదాడ రెవెన్యూ డివిజన్లో ఉన్న చింతలపాలెం, మేళ్లచెర్వు, మఠంపల్లి, హుజూర్నగర్లను, అలాగే సూర్యాపేట రెవెన్యూ డివిజన్లో ఉన్న గరిడేపల్లి, నేరేడుచెర్ల, పాలకవీడు మండలాలను వేరు చేసి హుజూర్నగర్ రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.