గత వారం రోజులుగా సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలకు ఏపీఎస్ ఆర్టీసీ కార్మికసంఘాలు సంఘీభావం తెలుపుతూ ఎల్లుండి ఆదివారంనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 128 డిపోలా ముందు ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. టిఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాల పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండించారు. టిఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలకు పూర్తిగా మద్దతు తెలుపుతున్నామని, అవసరమైతే వారితో కలిసి పోరాడేందుకు సిద్దంగా ఉన్నామని ఏపీఎస్ ఆర్టీసీ కార్మికసంఘాల నేతలు ప్రకటించారు.
పొరుగు రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ కార్మికసంఘాలు టిఎస్ ఆర్టీసీకి మద్దతు పలకడం ఆశ్చర్యంగా ఉన్నా రాష్ట్ర విభజన జరిగే వరకు దశాబ్ధాలపాటు వారందరూ సహోద్యోగులుగా కలిసిమెలిసి పనిచేసినందున, సంఘీభావం ప్రకటించినట్లు భావించవచ్చు.
టిఎస్ ఆర్టీసీ సమ్మెతోనే తెలంగాణ ప్రభుత్వం చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఏపీఎస్ ఆర్టీసీ కూడా వారికి తోడైతే అగ్నికి వాయువు తోడైనట్లవుతుంది కనుక సమస్య తీవ్రత ఇంకా పెరగవచ్చు. దీని వలన రెండు రాష్ట్రప్రభుత్వాల మద్య సంబంధాలు దెబ్బ తినే ప్రమాదం కూడా ఉండవచ్చు. కనుక ఏపీ సిఎం జగన్మోహన్రెడ్డి ముందుగానే నష్టానివారణ చర్యలు చేపడితే మంచిదేమో?