సచివాలయం కూల్చివేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం మధ్యాహ్నం విచారణ చేపట్టింది. ఈనెల 14వ తేదీన దీనిపై విచారణ చేపడతామని అప్పటి వరకు సచివాలయం కూల్చివేతపనులు మొదలుపెట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై దాఖలైన అభ్యంతరాలను కూడా నేడు విచారించిన హైకోర్టు దసరా శలవుల తరువాత దీనిపై విచారణ చేపడతామని అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయవద్దని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
సచివాలయం కూల్చివేతపై హైకోర్టు స్టే విధించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం దాని స్థానంలో కొత్త సచివాలయం డిజైన్ల కోసం టెండర్లు పిలువగా దేశంలో 9 కంపెనీలు తమ డిజైన్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాయి. ఈరోజు జరిగే మంత్రివర్గం సమావేశంలో చర్చించి సిఎం కేసీఆర్ వాటిలో ఏదో ఒకటి ఖరారు చేసే అవకాశం ఉంది.
మున్సిపల్ ఎన్నికలు ఇవాళ్ళ కాకపోతే రేపైనా జరుగుతాయి కానీ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు అనుమతించకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఇటుక కూడా కదపలేదు. ఒకవేళ హైకోర్టు నిరాకరిస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవలసి ఉంటుంది.