ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులలో నిందితులను తక్షణం అరెస్ట్ చేయడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇదే కేసులో గత ఏడాది మార్చి 20న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని కేంద్రప్రభుత్వం విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు త్రిసభయ్ ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకొంది. నేటికీ దేశంలో ఎస్సీ, ఎస్టీలు వేధింపులకు గురవుతూనే ఉన్నారని, వారికి న్యాయం జరగాలంటే, ఇటువంటి చట్టపరమైన రక్షణ అవసరమని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. కనుక ఇకపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులలో నిందితులను పోలీసులు తక్షణం అరెస్ట్ చేయడమే కాకుండా, దర్యాప్తు చేయక మునుపే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. దీనితో ఎస్సీ, ఎస్టీలకు చట్టపరమైన రక్షణ కల్పించాలనే ఆలోచన చాలా మంచిదే. కానీ అధికారంలో ఉన్నవారు తమ రాజకీయ ప్రయోజనాల కొరకు దీనిని దుర్వినియోగం చేస్తే అమాయకులైన పౌరులు బలయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కనుక ఈ చట్టాన్ని అమలుచేయడానికి తగిన మార్గదర్శకాలు చాలా అవసరం.