సాధారణ ఎన్నికలలో తమ పార్టీని గెలిపిస్తే అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పుకొని రాజకీయపార్టీలు ప్రజలను ఓట్లు అడుగుతుంటాయి. కానీ ఉపఎన్నికలలో వేరే మంత్రం పటించాల్సి ఉంటుంది. తెరాస అధికారంలో ఉంది కనుక తమ అభ్యర్ధి సైదిరెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చేస్తాడని చెప్పుకోగలదు. కానీ ప్రతిపక్షపార్టీలకు ఆ అవకాశం ఉండదు కనుక వేరే స్టోరీ ఏదైనా చెప్పాల్సి ఉంటుంది.
హుజూర్నగర్ ఉపఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఒక వాదన సిద్దం చేసుకొంది. ఈ ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యానికి అధికార అహంకారానికి జరుగుతున్నవని కనుక కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకోవాలని ప్రజలను కోరుతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సీనియర్ నేత జానారెడ్డి నేతృత్వంలో ఈ ఉప ఎన్నికలను ఎదుర్కొని విజయం సాధిస్తామని అన్నారు. త్వరలోనే ఎన్నికల ప్రచారం మొదలుపెడతామని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్ధి (?) కనీసం 30,000 ఓట్లు మెజార్టీతో గెలుస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. పార్టీలో సీనియర్లు అందరూ ఆయన అర్ధాంగి పద్మావతీ రెడ్డికే మద్దతు తెలుపుతున్నారు కనుక ఆమెకే టికెట్ లభించవచ్చు.