హుజూర్నగర్ ఎమ్మెల్యేగా ఉండే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి లోక్సభకు పోటీ చేసి గెలవడంతో హుజూర్నగర్ స్థానం ఖాళీ అయ్యింది కనుక త్వరలోనే దానికి ఉపఎన్నికలు జరుగనున్నాయి.
ఆ స్థానాన్ని తన సతీమణి పద్మావతికి కేటాయించాలనుకొంటునట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని రోజుల ప్రకటించారు. కానీ దానికోసం రేవంత్ రెడ్డి వర్గం కూడా గట్టిగా పట్టుపట్టడంతో శ్యామల కిరణ్ రెడ్డి పేరును రేవంత్ రెడ్డి ప్రతిపాదించి ఆమెకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో హుజూర్నగర్లో టికెట్ సాధించడం ఉత్తమ్-రేవంత్లకు ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ఈ విభేధాలు తమకు కలిసివస్తాయని తెరాస భావిస్తే ఆశ్చర్యం లేదు.
జనసేన నేతృత్వంలో యురేనియం త్రవ్వకాలను వ్యతిరేకిస్తూ హైదరాబాద్లో ఏర్పాటుచేసిన అఖిలపక్షసమావేశానికి కాంగ్రెస్ నేతలు హాజరుకావడాన్ని తప్పు పట్టిన కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ను ఉద్దేశ్యించి ‘యురేనియం గురించి ఆయనకు ఏబీసీడీలు కూడా తెలియవని, కనుక అఖిలపక్ష సమావేశం గురించి మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎవరికి పదవులు వస్తాయో, ఊడుతాయో ఎవరికీ తెలియదని రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్య పార్టీలో కలకలం పుట్టించింది. ఆయన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశ్యించి ఆ మాట అన్నారా లేక ఆ పదవి తనకు లభించకపోవచ్చునని తెలిసి ఆ మాట అన్నారా లేక అది తమ పార్టీ సంస్కృతి అనే ఉద్దేశ్యంతో అన్నారో త్వరలోనే తెలియవచ్చు.