రాష్ట్ర విభజన జరిగి ఐదున్నరేళ్ళుకావస్తోంది కానీ నేటికీ ఆస్తులు, అప్పుల పంచాయితీ కొనసాగుతూనే ఉంది. గతంలో ముఖ్యమంత్రులు కేసీఆర్-చంద్రబాబునాయుడు మద్య పంతాలు, పట్టింపుల కారణంగానే ఇరు రాష్ట్రాల అధికారులు కూడా ముందుకు సాగలేకపోవడంతో సమస్యలు అపరిష్కృతంగా నిలిచిపోయాయనే సంగతి అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కేసీఆర్-జగన్ ఇద్దరూ స్నేహపూర్వకంగా ఉన్నందున ఒక్కో సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతోంది.
తాజాగా హైదరాబాద్లో గల విద్యుత్ శాఖకు చెందిన ఆస్తుల పంపకంపై ఇరు రాష్ట్రాల అధికారులు చర్చలు జరిపి సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చారు. వారి లెక్కల ప్రకారం వాటి విలువలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెల్లించవలసియన్ వాటా రూ. 933 కోట్లు. అలాగే విద్యుత్ బకాయిల క్రింద తెలంగాణ ప్రభుత్వం ఏపీకి రూ.3,000 కోట్లు బాకీ ఉన్నట్లు సూత్రప్రాయంగా నిర్ధారించారు. రెండూ కలిపి మొత్తం రూ. 3933 కోట్లు అవుతుంది. ఇంత మొత్తం ఒకేసారి చెల్లించడం కష్టం కనుక ఈ బాకీలను వాయిదాల పద్దతిలో కానీ లేదా విద్యుత్ సరఫరా చేయడం ద్వారా గానీ చెల్లించాలని సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చారు. త్వరలోనే ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ సమావేశమయ్యి దీనిపై తుది నిర్ణయం తీసుకొనున్నారు.