భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి గురువారం భారతరత్న అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. దశాబ్ధాలపాటు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ఆయన ఇటువంటి అత్యున్నత పురస్కారం అందుకొంటున్నప్పుడు, ఆ కార్యక్రమానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు హాజరవుతారని ఆశించడం సహజం. కానీ రాష్ట్రపతి భవన్లో నిన్న సాయంత్రం జరిగిన ఆ కార్యక్రమానికి వారిరువురూ హాజరుకాలేదు. కేంద్రమంత్రులు, బిజెపి అగ్రనేతలు మాత్రమే హాజరయ్యారు. వారందరూ ఆయనకు అభినందనలు తెలిపారు.
ఆయన బిజెపికి, ఆర్ఎస్ఎస్ పెద్దలతో సన్నిహితంగా మెలుగుతుండటం వారికి నచ్చలేదని అందుకే ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారని సమాచారం. అయితే ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్న తరువాత కూడా వారిరువురూ ఇంకా ఆ విషయాలను మనసులో పెట్టుకొని ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం విమర్శలకు తావిచ్చింది. ప్రతీ విషయాన్ని రాజకీయ భూతద్దంలో నుంచే చూస్తూ, దాని వలన కలిగే లాభనష్టాలను లెక్కగట్టుకొని వ్యవహరించే దురలవాటు వలన కాంగ్రెస్ పార్టీకి లాభం కంటే నష్టమే కలిగిస్తుందని అనేకసార్లు నిరూపితమైంది. మళ్ళీ మరోసారి అదే జరిగింది.