ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సిఎం జగన్మోహన్రెడ్డికి హిందూ సెంటిమెంట్లు బాగా పెరిగినట్లున్నాయి. గెలిచిన తరువాత తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవడం, ప్రమాణస్వీకారానికి, సచివాలయంలో అడుగుపెట్టడానికి, శాసనసభ్యుల ప్రమాణస్వీకారాలకు, మంత్రివర్గ ఏర్పాటుకు, శాసనసభ సమావేశాలకు ముహూర్తాలు పెట్టించుకోవడం, నేడు విశాఖనగరంలోని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రను దర్శించుకొని ఆశీస్సులు తీసుకోవాలనుకోవడం వంటివి చూస్తుంటే క్రీస్టియన్ మతస్థుడైన జగన్కు హిందూమతంపై నమ్మకం పెరిగినట్లు కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అన్ని మతాలు, కులాలను సమానంగా గౌరవించడం, ఆదరించడం సాధారణమైన విషయమే కానీ ప్రతీ పనికీ జగన్ ముహూర్తాలు పెట్టుకోవడం చూస్తే సిఎం కేసీఆర్ను తలపిస్తున్నారిప్పుడు. జగన్ మొదటిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టినందున మంత్రివర్గం ఏర్పాటు చేసుకొని పరిపాలన గాడినపడేవరకు కొంత ఆందోళన, అయోమయం నెలకొని ఉండటం సహజం. కనుక అప్పటి వరకు ముహూర్తాలు, సెంటిమెంటులు కొనసాగవచ్చునేమో?