ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్రెడ్డి, “హైదరాబాద్లో ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్నారని,” చేసిన వ్యాఖ్యలతో బిజెపి-మజ్లీస్ పార్టీల మద్య మాటల యుద్ధం మొదలైంది. హైదరాబాద్ నగరంలో గతంలో కంటే ఇప్పుడు చాలా ప్రశాంత వాతావరణం నెలకొందని, ఆ కారణంగా నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
దీనిపై మళ్ళీ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ, “హైదరాబాద్ నగరంలో ఉగ్రవాదులు ఉన్నారంటే అందుకు కారణం అసదుద్దీన్ ఓవైసీయే. ఆయన ప్రాతినిద్యం వహిస్తున్న హైదరాబాద్ నియోజకవర్గం పరిధిలో ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్రప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను ఆయన ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు మళ్ళిస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో సుమారు 7,000కు పైగా వివిదదేశాలకు చెందిన ముస్లింలు అక్రమంగా నివసిస్తున్నారు. వారందరికీ ఆయనే ఆశ్రయం కల్పిస్తున్నారు. వారీనందరినీ వెనక్కు తిప్పి పంపించేందుకు ఎన్ఆర్సీని అమలుచేయాలని మేము కేంద్రప్రభుత్వాన్ని కోరుతాము.
అసదుద్దీన్ ఓవైసీ అనేక ఏళ్లుగా ఎంపీగా ఉన్నప్పటికీ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏమీ చేయకపోవడంతో పాతబస్తీ ప్రజలలో ఆయన పట్ల చాలా వ్యతిరేకత నెలకొని ఉంది. వచ్చే లోక్సభ ఎన్నికలలో హైదరాబాద్ ఎంపీ సీటును బిజెపి సొంతం చేసుకోవడం ఖాయం. అసదుద్దీన్ ఓవైసీ ఓటమితోనే హైదరాబాద్ పాతబస్తీవాసులకు ఓవైసీల నుంచి విముక్తి లభిస్తుంది,” అని అన్నారు.