అప్పుడు తడబాటు..ఇప్పుడు ఖరాఖండి!

May 02, 2018


img

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం ఒక కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ లోని తన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికలలో తమ పార్టీ ఏపిలోని 175 స్థానాలకు పోటీ చేస్తుందని ప్రకటించారు. ఈ సందర్భంగా తమ పార్టీ ఎన్నికల వ్యూహకర్త దేవ్ ను పరిచయం చేశారు. దేవ్ గత 10 నెలలుగా జనసేన పార్టీలో పనిచేస్తున్నారు. 

3-4 నెలల క్రితం రాష్ట్రంలో అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని జనసేన ట్విట్టర్ లో ప్రకటించింది. కానీ అప్పటికి జనసేన-తెదేపా మద్య ఇంకా స్నేహసంబంధాలు ఉన్నందున ఆ ప్రకటనపై మీడియాలో.. ముఖ్యంగా తెదేపాలో చాలా కలకలం రేగింది. అది చూసి వెంటనే ట్విట్టర్ లో పెట్టిన ఆ ప్రకటనను తొలగించి, పొరపాటున ఆవిధంగా పెట్టామని వివరణ ఇచ్చుకొంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అన్ని స్థానాలకు జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించడం గమనిస్తే, ఆనాడు పొరపాటున ఆ విషయం ప్రకటించినప్పటికీ, అప్పుడే అన్ని స్థానాలకు పోటీ చేయాలని జనసేన నిర్ణయించుకొందని అర్ధమవుతోంది. అప్పుడు తడబడినప్పటికీ ఇప్పుడు జనసేనకు తెదేపాతో ఎటువంటి మిత్రత్వం లేదు కనుక పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ విషయాన్నీ ఖరాఖండిగా చెప్పేసినట్లు భావించవచ్చు. 



Related Post