జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం ఒక కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ లోని తన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికలలో తమ పార్టీ ఏపిలోని 175 స్థానాలకు పోటీ చేస్తుందని ప్రకటించారు. ఈ సందర్భంగా తమ పార్టీ ఎన్నికల వ్యూహకర్త దేవ్ ను పరిచయం చేశారు. దేవ్ గత 10 నెలలుగా జనసేన పార్టీలో పనిచేస్తున్నారు.
3-4 నెలల క్రితం రాష్ట్రంలో అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని జనసేన ట్విట్టర్ లో ప్రకటించింది. కానీ అప్పటికి జనసేన-తెదేపా మద్య ఇంకా స్నేహసంబంధాలు ఉన్నందున ఆ ప్రకటనపై మీడియాలో.. ముఖ్యంగా తెదేపాలో చాలా కలకలం రేగింది. అది చూసి వెంటనే ట్విట్టర్ లో పెట్టిన ఆ ప్రకటనను తొలగించి, పొరపాటున ఆవిధంగా పెట్టామని వివరణ ఇచ్చుకొంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అన్ని స్థానాలకు జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించడం గమనిస్తే, ఆనాడు పొరపాటున ఆ విషయం ప్రకటించినప్పటికీ, అప్పుడే అన్ని స్థానాలకు పోటీ చేయాలని జనసేన నిర్ణయించుకొందని అర్ధమవుతోంది. అప్పుడు తడబడినప్పటికీ ఇప్పుడు జనసేనకు తెదేపాతో ఎటువంటి మిత్రత్వం లేదు కనుక పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ విషయాన్నీ ఖరాఖండిగా చెప్పేసినట్లు భావించవచ్చు.