భాజపాకు వారిద్దరే చాలు

March 28, 2018


img

కురుక్షేత్ర యుద్ధం జరగడానికి కారణం ఎవరు? కర్ణుడి చావుకు కారణం ఏమిటి?అనే ప్రశ్నలకు అనేక సమాధానాలు వినిపిస్తుంటాయి. అలాగే ఇప్పుడు మే 12న జరుగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో భాజపా గెలుపు లేదా ఓటమికి కారకులెవరు కాబోతున్నారు? అనే ప్రశ్న వినిపిస్తోంది. 

అవినీతికి మారుపేరైన ఎడ్యూరప్ప కర్ణాటకలో చాలా బలమైన రాజకీయనాయకుడు కూడా. ఆ కారణంగానే భాజపా మళ్ళీ ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించి ముఖ్యమంత్రిఅభ్యర్ధిగా ప్రకటించింది. కనుక భాజపా గెలిచినా ఓడినా ఆయనదే బాధ్యత అవుతుందని వేరే చెప్పనవసరం లేదు. 

ఎడ్యూరప్పకు ఏ విషయంలోను తీసిపోని మరో వ్యక్తి గాలి జనార్ధన్ రెడ్డి. నిజం చెప్పాలంటే అవినీతిలో ఎడ్యూరప్ప కంటే రెండాకులు ఎక్కువే చదివిన ఘనుడు గాలి జనార్ధన రెడ్డి. అతను భాజపా టికెట్ పై బళ్ళారి నుంచి పోటీ చేయబోతున్నట్లు అతని సోదరుడు సోమశేఖర్ రెడ్డి బుధవారం బళ్లారిలో ప్రకటించారు. 

నోట్ల రద్దు తరువాత దేశప్రజలందరూ నగదు కొరత కారణంగా కటకటలాడుతున్నప్పుడు, వందల కోట్లు ఖర్చు పెట్టి చాలా అట్టహాసంగా బెంగళూరులో తన కూతురు పెళ్ళి జరిపించిన ఘనుడు గాలి జనార్ధన్ రెడ్డి. కనుక అగ్నికి వాయువు తోడైనట్లు ఎడ్యూరప్పకు అవినీతి ‘గాలి’ కూడా తోడయితే కర్ణాటకలో భాజపా ఘన విజయం సాధించినా సాధించవచ్చు లేదా వారిరువురి ‘ఘన చరిత్ర’ల కారణంగానే మళ్ళీ ఓడిపోవచ్చు. అయితే ఎన్నికలలో భాజపా గెలిచినా గెలవకపోయినా వారిరువురూ బారీ మెజార్టీతో గెలవడం ఖాయం అని ఖచ్చితంగా చెప్పవచ్చు.     



Related Post