ఇవ్వాళ్ళ కూడా లోక్ సభ సమావేశం ప్రారంభంకాగానే అన్నాడిఎంకె ఎంపిలు కావేరీ బోర్డ్ ఏర్పాటు చేయాలని కోరుతూ స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకువచ్చి నినాదాలు చేయడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇదంతా ఒక్క నిమిషంలోనే పూర్తయింది. మధ్యాహ్నం లోక్ సభ మళ్ళీ సమావేశమైనప్పుడు కూడా మళ్ళీ అన్నాడిఎంకె సభ్యులు ఆందోళన చేయడం, ఆ కారణంగా సభను రేపటికి వాయిదావేసే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. కనుక కాంగ్రెస్ పార్టీతో సహా 5 పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కోవడానికి మోడీ సర్కార్ ఇష్టపడటం లేదనే సంగతి కూడా స్పష్టం అయ్యింది. ఒకవేళ సిద్దపడినా వాటిపై సభలో పెద్దగా చర్చ జరుగకుండానే వాటిని తిరస్కరించి, వెంటనే పార్లమెంటు ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేసి తప్పించుకొనే ప్రయత్నం చేయవచ్చు.