ఆ బస్సులో నాగం కూడా ఎక్కబోతున్నారా?

February 21, 2018


img

భాజపా సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి కొన్ని రోజుల క్రితం డిల్లీ రాహుల్ గాంధీని కలిసివచ్చి ఉగాది తరువాత పార్టీ మారుతానని ప్రకటించారు. కనుక ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని స్పష్టం అయ్యింది. అయితే ఈనెల 26 నుంచే రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరూ కలిసి బస్సు యాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి సభలు, రోడ్ షోలు చేయబోతున్నారు. కనుక ఇటువంటి మంచి అవకాశాన్ని వదులుకొంటే మళ్ళీ స్వయంగా ప్రచారం చేసుకోవడం నాగంకు సాధ్యం కాకపోవచ్చు. కనుక త్వరలోనే డిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పించుకొని తాను కూడా ఆ బస్సు ఎక్కాలని నాగం జనార్ధన్ రెడ్డి యోచిస్తున్నట్లు తాజా సమాచారం. ఆయనతో పాటు మండవ వెంకటేశ్వరరావు (నిజామాబాద్), అన్నపూర్ణమ్మ (మాజీ ఎమ్మెల్యే), ప్రతాప్ రెడ్డి (గజ్వేల్) తదితరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దం అవుతున్నారని సమాచారం. కనుక ఒకటి రెండు రోజులలోనే నాగంతో సహా వారందరూ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇప్పుడు చేరలేకపోతే, కాంగ్రెస్ బస్సు నాగర్ కర్నూల్ జిల్లా చేరుకొనేలోగానైనా నాగం జనార్ధన్ రెడ్డి దానిలో ఎక్కే అవకాశం ఉంది.  



Related Post