జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణా పర్యటనపై అనేక ప్రశ్నలు, అనుమానాలు, విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వాటిలో పవన్ కళ్యాణ్ పై వచ్చినవి తక్కువ, ముఖ్యమంత్రి కెసిఆర్ ను నిలదీస్తూ సంధించినవి ఎక్కువగా ఉండటమే విచిత్రం.
ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతూ వరుసగా రెండుసార్లు జైలుకు వెళ్ళివచ్చిన మందకృష్ణ మాదిగ కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఈ విషయంపై సూటిగా ప్రశ్నించారు. “ఒక వర్గం ప్రయోజనాలను కాపాడటం కోసం పోరాడుతున్న నన్ను ప్రభుత్వం పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తుంటుంది. కానీ అదే పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటనకు వస్తే ఆయనకు బారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పటు చేసి రక్షణ కల్పిస్తుంది. ఇదెక్కడి న్యాయం? గతంలో కెసిఆర్, హరీష్ రావు తదితరులు తెలంగాణా సాధన కోసం నిరాహార దీక్షలు చేస్తే తప్పు లేదు కానీ నేను ఎస్సీ వర్గీకరణ కోసం దీక్ష చేస్తే నేరం అని జైల్లో పడేస్తున్నారు. నాకో నియమం..వారికో నియమమా? ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ప్రజలే బుద్ధి చెపుతారు. త్వరలోనే నేను గవర్నర్ నరసింహన్ ను కలిసి కెసిఆర్ నియంతృత్వ వైఖరి గురించి పిర్యాదు చేస్తాను,” అన్నారు మందకృష్ణ మాదిగ.