రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత పార్టీలో చాలా బారీగా మార్పులు చేర్పులు చేస్తారని మీడియాలో వస్తున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ, ప్రస్తుతం అటువంటి ఆలోచనలు ఏవీ చేయడంలేదని అయన స్పష్టం చేశారు. అంటే రాష్ట్రాలకు సంబంధించినంత వరకు పిసిసి అధ్యక్ష పదవులలో ఎటువంటి మార్పు ఉండబోదని భావించవచ్చు. కనుక పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవికి ఇక ఎన్నికల వరకు డోకా లేదనే భావించవచ్చు.
అయితే సంక్రాంతి పండుగ హడావుడి ముగిసిన తరువాత టిపిసిసికి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకొంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు మీడియాకు తెలియజేశారు. పుష్పకవిమానం వంటి పిసిసి కార్యవర్గంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలలో దాదాపు అందరూ ఉన్నారు. కనుక దానిలో మార్పులు అంటే అటూఇటూ పదవుల మార్పిడి చేసి చేతులు దులుపుకోవడం తప్ప మరేమీ సాధ్యం కాకపోవచ్చు. అయితే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈసారి యువతకు కూడా పిసిసి కార్యవర్గంలో స్థానం కల్పించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. కనుక ఒకరిద్దరు సీనియర్ నేతలు ఎవరిననైనా పక్కనపెట్టే సాహసం చేస్తారేమో చూడాలి.