సుస్మిత కొణిదెల మెల్లగా నిర్మాతగా నిలద్రొక్కుకుంటున్నారు. తాజాగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో ‘జగమే సంగీతం’ అనే వెబ్ సిరీస్ సిద్ధం చేశారు.
కర్ణాటక సంగీతాన్ని తరతరాలుగా వారసత్వంగా కొనసాగిస్తున్న ఓ కుటుంబం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు ‘శాస్త్రి’ పాత్ర ఈ కథలో కీలకంగా ఉంటుంది. ఆ కుటుంబంలో సంగీత వారసత్వం ఏవిధంగా కొనసాగిందనేది ఈ వెబ్ సిరీస్ మూలకథ. దీనిలో ప్రముఖ నటులు శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
కర్ణాటక సంగీతం... దానిని వంశపారంపర్యంగా కొనసాగిస్తున్న కుటుంబాలపై మారుతున్న పరిస్థితుల ప్రభావం, తరాల అంతరం, కుటుంబంలో సమస్యలు వంటివన్నీ ఈ వెబ్ సిరీస్లో చూపబోతున్నారు.
‘జగమే సంగీతం’ వెబ్ సిరీస్కు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 4 నుంచి 240 దేశాల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.