ఎవరిని పడితే వారిని చేర్చుకోవడానికి బీజేపీ చెత్తబుట్ట కాదు!

September 05, 2026


img

మంత్రి పదవి కోల్పోయిన కొండా సురేఖతో బిజేపి, బీఆర్ఎస్‌ పార్టీలు తెరవెనుక చర్చలు జరుపుతున్నాయంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాటిపై బీఆర్ఎస్‌ పార్టీ సీనియర్ నేత పి.మురళీధర్ రావు సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు.

“బీజేపీ చెత్తబుట్ట కాదు. కాంగ్రెస్‌లో సంక్షోభం మొదలైనట్లు కనిపిస్తున్న ఈ సమయంలో.. ప్రతి ఊహాగాన రాజకీయ కథనాలతో బీజేపీని లాగేందుకు మీడియా ఎందుకంత తొందరపడుతోంది?

కాంగ్రెస్‌లో నెలకొన్న సమస్యలను ముందుగానే అడ్డుకోవడం, చర్చను మరోవైపు మళ్లించడం, తద్వారా ఆ పార్టీ ఇబ్బందులను మొగ్గలోనే తుంచేయడానికి చేస్తున్న ప్రయత్నమా ఇది?

తెలంగాణ కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లకు విశ్వసనీయమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని రాష్ట్రంలోని బీజేపీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న కార్యకర్తలు కోరుకుంటున్నారు. కనుక అసంతృప్తితో రగిలిపోతున్న నాయకులకు ఆశ్రయం కల్పించడం మా పార్టీ విధానం కాదు. భారతీయ సంస్కృతి, వ్యక్తిత్వం, మెరుగైన రాజకీయ విధానాల ద్వారానే బిజేపిని ప్రత్యామ్నాయంగా నిలుపుతాము తప్ప మరో పార్టీకి మారు పేరుగా కాదు. బీజేపీ చెత్తబుట్టగా మారదు.

ఈ ఊహాగానాలతో పైకి కనిపిస్తున్నవాటి కంటే బలమైన రాజకీయ ఉద్దేశ్యాలు చాలా ఉండవచ్చు. కనుక ఈ ప్రచారం విషయంలో పార్టీలో అందరూ అప్రమత్తంగా ఉండాలి,” అని విజ్ఞప్తి చేశారు. 

కొండా సురేఖని మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత బిజేపి ఎంపీ డీకే అరుణ ఆమెకు అన్యాయం జరిగిందంటూ సానుకూలంగా మాట్లాడారు. అలాగే నిజామాబాద్‌ బిజేపి ఎంపీ ధర్మపురి అరవింద్ కొండా దంపతులను బిజేపిలో తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బిజేపిలో చేరబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక వాటన్నిటికీ మురళీధర్ రావు ఒక్క ట్వీట్‌తో చెక్ పెట్టారు. 

తాను కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని కొండా సురేఖ చెప్పుకున్నప్పటికీ, పార్టీలో, ప్రభుత్వంలో గౌరవం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్‌లో కొనసాగడం చాలా అవమానకరంగా ఉంటుంది. ఆమెను బీఆర్ఎస్‌ పార్టీలో చేర్చుకోబోమని జగదీశ్ రెడ్డి నిన్ననే స్పష్టం చేశారు. ఇప్పుడు ఆమెకు బిజేపి తలుపులు కూడా మూసుకుపోయాయి. ఇక మిగిలింది టీఆర్ఎస్‌ పార్టీ మాత్రమే. కానీ కొండా దంపతులు కల్వకుంట్ల కవిత ముందు చేతులు కట్టుకొని నిలబడగాలరా?    


Related Post