ఇస్రో జీఎస్ఎల్వీ-ఎఫ్‌ 17 ప్రయోగం విజయవంతం

September 04, 2026
img

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చరిత్రలో నేడు మరో విజయం నమోదు అయ్యింది. అది చేపట్టిన జీఎస్ఎల్వీ-ఎఫ్‌ 17 ప్రయోగం విజయవంతమైంది. 

శుక్రవారం తెల్లవారుజామున శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్‌ 17 ఉపగ్రహవాహక నౌక ద్వారా ప్రయోగించిన ఈఓఎస్-05 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

సుమారు 18 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయోగంలో 2,367 కేజీలు బరువు,  51.7 అడుగుల ఎత్తు కలిగిన జీఎస్ఎల్వీ-ఎఫ్‌ 17 రాకెట్, సుమారు 420 కేజీలు బరువు కలిగిన ఈఓఎస్-05 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం భూమికి 170 కిమీ దూరం నుంచి 28,934 కిమీ దూరం గల కక్ష్యలో తిరుగుతుంటుంది. 

ఈ కోవకు చెందిన మిగిలిన ఉపగ్రహాలు భూమి మీద ఏదైనా ఒక ప్రాంతాన్ని ఫోటోలు తీసి పంపాలంటే కనీసం వారం నుంచి రెండు మూడు వారాల సమయం పడుతుంది. కానీ ఈ ఈఓఎస్-05 ఉపగ్రహం ప్రత్యేకత ఏమిటంటే, కేవలం 10 నిమిషాలకు ఒకసారి భారత్‌ ఫోటోలు తీసి పంపగలదు. అంతే కాదు యావత్ దక్షిణాసియా ప్రాంతాన్ని ఒకే ఫ్రేములో ఫోటో తీసి పంపగలదు. దీనిలో అమర్చిన ఎంఎక్స్-విఎన్ఆర్ పేలోడ్‌లో 42 మీటర్ల స్పేసిషియల్ రిజల్యూషన్ కలిగి ఉండటం, భూస్థిర కక్ష్య (జియో ఆర్బిట్)లో తిరుగుతుండటం వలన ఇది సాధ్యపడింది. జియో కక్ష్యలో తిరుగుతున్న ప్రపంచ దేశాల ఉపగ్రహాలలో అత్యధిక రిజల్యూషన్ కలిగిన ఉపగ్రహం ఇదే. ఇది మన భారత్‌ది కావడం మన అందరికీ గర్వకారణం.   

దీని ప్రధాన ప్రయోజనాలు: ప్రకృతి విపత్తులను రియల్-టైమ్‌లో చిత్రీకరించి పంపించగలదు. సరిహద్దులలో శత్రుదేశాల రహస్య స్థావరాలను అవలీలగా గుర్తించగలదు. చివరికి దేశంలో నదులు, ఇతర నీటి వనరులలో పేరుకుపోయిన కాలుష్యాన్ని కూడా గుర్తించగలదు. అలాగే భూగర్భంలోని ఖనిజ సంపదని గుర్తించ గలదు. పంటల పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించగలదు.            

ఇస్రో 2021లో ఇదే ప్రయోగం చేయగా విఫలమైంది. కనుక పట్టుదలగా ఈ సారి అంతకంటే మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించి తన సామర్థ్యాన్ని చాటుకుంది. ఈ ప్రయోగం విజయవంతం అవడంతో ఇస్రోలో పండగ వాతావరణం నెలకొంది. ఇస్రో చైర్మన్‌వి. నారాయణన్, ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు ప్రధాని మోడీతో సహా దేశవిదేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

Related Post