ప్రముఖ సినీ పరిశ్రమ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి కుమారుడు సందీప్కు బెయిల్ లభించింది. ఈ నెల 1వ తేదీన అతను కారు నడుపుతూ ఓ వ్యక్తిని గుద్దేయగా ఓ వ్యక్తి చనిపోయాడు. కానీ సందీప్ ఆగకుండా వెళ్ళిపోయాడు.
రాయదుర్గం పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా అతను సందీప్ అని గుర్తించి అరెస్ట్ చేసి మంగళవారం రాత్రి న్యాయమూర్తి ముందు హాజరు పరచగా అతనికి బెయిల్ మంజూరు చేశారు.
ప్రమాదం జరిగినప్పుడు సందీప్ మద్యం లేదా మాదక ద్రవ్యాలు సేవించి కారు నడుపుతున్నాడా? అనే విషయం తెలుసుకునేందుకు పోలీసులు అతనికి పరీక్షలు జరుపగా లేదని నిర్ధారణ అయ్యింది.
అయితే అతను గతంలో గంజాయి సేవిస్తున్న వీడియో ఒకటి నిన్న సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో పోలీసులు అతని రక్త నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. గత రెండు మూడు నెలల్లో ఒకవేళ అతను గంజాయి లేదా మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లయితే ఫోరెన్సిక్ పరీక్షలో బయటపడుతుంది.
అందుకు వేరేగా కేసు నమోదు చేస్తారు. ప్రస్తుతం అతనిపై మోటార్ వెహికల్ యాక్టులో వివిధ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.