ఈ నెల 7వ తేదీ నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు మొదలవుతాయి. బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు, కృష్ణా, గోదావరి నీళ్ళ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది. కనుక ఆ పార్టీ అధినేత, మాజీ సిఎం కేసీఆర్ శాసనసభ సమావేశాలకు వస్తే జవాబు చెప్తామని సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా వేడుకలు జరుపుకుంటే, వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ పార్టీ ఛార్జ్ షీట్ విడుదల చేసింది.
ఈ సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, “వెయ్యి రోజుల ప్రజా పాలన కాదు.. ప్రజా పీడన. పదేళ్ళలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ళలోనే సర్వనాశనం చేసింది. తెలంగాణ పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది.
కాంగ్రెస్ పార్టీలో ఎంత సేపు పదవుల కోసం కీచులాటలు, వాటి కోసం ఢిల్లీలో పైరవీలు మంత్రులు, ఏ పనీ చేయకపోయినా 30 శాతం కమీషన్ వసూలు చేయడం, దానిలో తమ అధిష్టానానికి ముట్టజెప్పి పదవులు కాపాడుకోవడం అందరికీ ఇదే యావ. ఎవరికీ ప్రజల సమస్యలు పట్టవు.
22ఏ వంటి నిబంధనలతో ప్రజల ఆస్తులను వివాదాస్పద భూములలో చేర్చి వారిని పీడిస్తోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మూడేళ్ళలో ప్రభుత్వం రూ.4.5 లక్షల కోట్లు అప్పు చేసింది. కానీ ఒక్క అభివృద్ధి పని చేయలేదు. ఎన్నికల హామీలు నెరవేర్చలేదు. కానీ ఆ అప్పుల భారం ప్రజలపై మోపుతోంది.
రివర్ బోర్డు సమావేశాలలో కూడా గట్టిగా వాదించకపోవడంతో చివరికి కృష్ణా, గోదావరి నీళ్ళని కాపాడకుండా చంద్రబాబు నాయుడుకి గురు దక్షిణగా సమర్పిస్తున్నారు,” అంటూ కేటీఆర్ సిఎం రేవంత్ రెడ్డిపై నిప్పుల వర్షం కురిపించారు.