తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర చిహ్నం, తెలంగాణ రాష్ట్రాన్ని సూచించేందుకు ‘టిఎస్’ని, అలాగే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు.
అయితే అవన్నీ కేసీఆర్ రాచరిక పోకడలకు అద్దం పడుతున్నాయే తప్ప తెలంగాణ సంస్కృతి, ఉద్యమాలు, ఉద్యమకారులను ప్రతిబింబించేలా లేవని సిఎం రేవంత్ రెడ్డి ఆనాడే వాదించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అవన్నీ మార్చేస్తామని చెప్పారు.
చెప్పిన్నట్లుగానే ముందుగా తెలంగాణ రాష్ట్రాన్ని సూచించే ‘టిఎస్’ తొలగించి దాని స్థానంలో ‘టిజి’ (తెలంగాణ గవర్నమెంట్)గా మార్పు చేయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో రాచరికాన్ని ప్రతిబింబించే ఛార్మినార్, కాకతీయ తోరణాలను తొలగించి, తెలంగాణ ఉద్యమం, సంస్కృతిని సూచించే విదంగా కొత్త చిహ్నం తయారు చేయిస్తున్నారు. సిఎం రేవంత్ రెడ్డి ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశంతో ఆదివారం సమావేశమై, ఆయన రూపొందించి కొత్త చిహ్నాన్ని ఖరారు చేశారు.
కేసీఆర్ తన కుమార్తె కల్వకుంట్ల కవిత రూపురేఖలతో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయించారని రేవంత్ రెడ్డి మొదటి నుంచి ఆరోపిస్తూనే ఉన్నారు. కనుక ఆ విగ్రహాన్ని కూడా మార్పించి నాడు పెత్తందారులు, రజాకార్లతో పోరాడిన చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం వంటివారిని, వారి పోరాటస్పూర్తిని ప్రతిబిమించే విదంగా కొత్త విగ్రహం తయారు చేయిస్తున్నారు.
జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీటన్నిటినీ సిఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించే అవకాశం ఉంది.