హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు భారీ మెజార్టీతో ఎన్నికైన అసదుద్దీన్ ఓవైసీ, ఈసారి మరింత భారీ మెజార్టీతో గెలుస్తానని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సరళిని బట్టి ఈ మాట చెపుతున్నానని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
అయితే ఈసారి హైదరాబాద్లో పోలింగ్ శాతం చాలా తక్కువగా 48.48 శాతం మాత్రమే నమోదు అయ్యింది. అప్పుడే అసదుద్దీన్ ఓవైసీ భారీ మెజార్టీతో గెలిచారు. ఈసారి మరో 4 శాతం ఎక్కువే జరిగింది కనుక అసదుద్దీన్ ఓవైసీ తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈసారి బీజేపీ అభ్యర్ధి మాధవీలత ఆయనకు చాలా గట్టి పోటీ ఇచ్చారు. కనుక ఆమె కూడా భారీ మెజార్టీతో గెలుస్తానని నమ్మకంగా ఉన్నారు.
కానీ ఒకవేళ అసదుద్దీన్ ఓవైసీ భారీ మెజార్టీతో గెలిస్తే ఆ క్రెడిట్ ఆమెకే దక్కుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీ చాలా వ్యూహాత్మకంగా హిందూ మతం గురించి గట్టిగా మాట్లాడే ఆమెను అభ్యర్ధిగా నిలబెట్టింది. కనుక పాతబస్తీతో సహా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో హిందూ ఓటర్లు అందరూ ముఖ్యంగా యూపీ, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడిన హిందువులు అందరూ ఆమెకే ఓట్లు వేస్తారు.
కానీ ఆమె కారణంగానే హైదరాబాద్ నియోజకవర్గం పరిధిలో ముస్లింలు అందరూ మళ్ళీ ఒక్కతాటిపైకి వచ్చి మజ్లీస్ అభ్యర్ధి అసదుద్దీన్ ఓవైసీకి ఓట్లు వేయడం ఖాయమే. కనుక ఈసారి ముస్లిం ఓట్లు చీలకుండా ఆమె కాపాడారని చెప్పవచ్చు. కనుక అసదుద్దీన్ ఓవైసీ భారీ మెజార్టీతో గెలిచిన్నట్లయితే అందుకు మాధవీలతకు కృతజ్ఞతలు చెప్పుకోవలసిందే.