బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎప్పటిలాగే ఈసారి కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాలేదని, ఇండియా కూటమి కూడా రాలేదని చెపుతున్నారు. అయితే ఈ రెండు కూటములు కాకుండా కేంద్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే ఓ జాతీయ మీడియా ప్రశ్నకు కేసీఆర్, తన మనసులో మెదులుతున్న ఆలోచనని చెప్పారు.
“ఈసారి లోక్సభ ఎన్నికల తర్వాత ఓ విచిత్రం జరుగబోతోంది. ఇండియా, ఎన్డీయే రెండు కూటములకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగినన్ని సీట్లు లభించవు.
అప్పుడు దేశంలో బలంగా ఉన్న బిఆర్ఎస్, వైసీపి, ఆమాద్మీ పార్టీ వంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్, బీజేపీలకు మద్దతు ఇస్తున్న పార్టీలే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కనుక ఈసారి లోక్సభ ఎన్నికల తర్వాత రివర్స్ పద్దతిలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడబోతోంది. దానిలో బిఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించబోతోంది. అందుకే తెలంగాణలో లోక్సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి అత్యధిక సీట్లు ఇచ్చి గెలిపించాలని మేము ప్రజలను కోరుతున్నాము. ఖమ్మంలో నామా నాగేశ్వర రావుని గెలిపిస్తే కేంద్రమంత్రిని చేస్తాము,” అని చెప్పారు.