తెలంగాణ మండలి ఛైర్మన్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమర్ సోమవారం జూబ్లీహిల్స్లోని సిఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
గుత్తా సుఖేందర్ రెడ్డి లోక్సభ ఎన్నికలలో టికెట్ ఆశించారు. కానీ కేసీఆర్ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అప్పటి నుంచే పార్టీకి దూరంగా ఉంటూ కేసీఆర్పై విమర్శలు చేస్తున్నారు కూడా. ఇప్పుడు ముందుగా కొడుకుని కాంగ్రెస్ పార్టీలో పంపించారు కనుక తర్వాత ఆయన కూడా కాంగ్రెస్ గూటికి తిరిగి చేరుకోవడం ఖాయమే అని భావించవచ్చు.
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్ర రాజకీయాలలో అనేక అనూహ్య పరిణామాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఈ ఎన్నికలలో కాంగ్రెస్ లేదా బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తే బిఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అయిపోవచ్చు.
ఒకవేళ బిఆర్ఎస్ ఎక్కువ సీట్లు సాధిస్తే, అది బీజేపీతో చేతులు కలిపి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకు ప్రయత్నించవచ్చు. అందుకే మూడు ప్రధాన పార్టీలు ఈ లోక్సభ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కనీసం 10-12 సీట్లు గెలుచుకునేందుకు కృషి చేస్తున్నాయి.