సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు బిఆర్ఎస్ అభ్యర్ధిగా ఎమ్మెల్యే లాస్య నివేదిత పేరుని కేసీఆర్ ఖరారు చేశారు.
ఆమె అక్క, బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రెండు నెలల క్రితం హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డులో కారు ప్రమాదంలో మరణించడంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగబోతోంది. ఆమె స్థానంలో ఆమె చెల్లి లాస్య నివేదిత ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపడంతో కేసీఆర్ ఆమెకు టికెట్ ఖరారు చేశారు.
మే 13న లోక్సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక కూడా జరుగబోతోంది. ఈ నెల 18న నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి నామినేషన్స్ స్వీకరణ మొదలవుతుంది కనుక బిఆర్ఎస్ అభ్యర్ధిగా లాస్య నివేదిత పేరుని కేసీఆర్ ఖరారు చేసి బీ ఫారం ఇచ్చారు.
లాస్య నందిత, లాస్య నివేదిత ఇద్దరూ దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెలు. ఆయన గత ఏడాది ఫిబ్రవరిలో కిడ్నీ వ్యాధితో చనిపోయారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు కాంగ్రెస్, బీజేపీలు సహకరించాలని లాస్య నివేదిత అభ్యర్ధించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బొటాబొటి మెజార్టీతో నడుస్తోంది కనుక ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకునేందుకు వచ్చే ఇటువంటి అవకాశాన్ని వదులుకోలేదు. కాంగ్రెస్ అభ్యర్ధిగా నారాయణన్ శ్రీ గణేశ్ని ప్రకటించింది.
నారాయణన్ శ్రీ గణేశ్ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి లాస్య నివేదిత చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్లో చేరి ఆమె చెల్లెలు లాస్య నందితతో పోటీకి సిద్దమయ్యారు. బీజేపీ ఇంకా అభ్యర్ధిని ప్రకటించాల్సి ఉంది.