ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో జ్యూడిషియల్ రిమాండ్లో ఉన్న కల్వకుంట్ల కవితని మళ్ళీ ప్రశ్నించేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐని అనుమతించింది.
కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె తరపు న్యాయవాది నితీష్ రాణా అదే కోర్టులో నేడు పిటిషన్ వేశారు. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు కొంత సమయం కావాలని సీబీఐ తరపు న్యాయవాది కోరడంతో ఈ నెల 10 వరకు గడువు ఇస్తూ విచారణను అప్పటికి వాయిదా వేసింది.
అయితే ఈ నెల 9వ తేదీన ఆమె బెయిల్ పిటిషన్ అదే కోర్టులో విచారణకు రానున్నది. కనుక ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా లేదా? అనే విషయం ఆరోజు తెలుస్తుంది. ఒకవేళ మంజూరు చేయకపోతే మర్నాడు ఆమెను జైల్లో విచారణ జరపవచ్చా లేదా? అనే దానిపై కోర్టు నిర్ణయం తెలియజేస్తుంది.
ఒకవేళ బెయిల్ మంజూరు చేసిన్నట్లయితే, అప్పుడు ఆమెను సీబీఐ బయట అంటే హైదరాబాద్లో ఆమె నివాసంలో ప్రశ్నించాల్సి ఉంటుంది. అందుకు కోర్టు అనుమతి అవసరం ఉండదని మార్చి 15న ఆమెను విచారణ జరిపినప్పుడే స్పష్టం అయ్యింది.