బీజేపీ మాజీ ఎమ్మెల్యే, మెదక్ ఎంపీ అభ్యర్ధి రఘునందన్ రావు మంగళవారం సంగారెడ్డిలో పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, “ఆనాడు ఓటుకి నోటు కేసులో రేవంత్ రెడ్డిని ఫోన్ ట్యాపింగ్ చేసే ట్రాప్ చేసి పట్టుకున్నారు. అంటే అప్పటి నుంచే రాష్ట్రంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తోందన్న మాట!
కానీ అప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులు ఎవరిపై కూడా ఇంతవరకు కేసులు నమోదు చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రణీత్ రావును అరెస్ట్ చేసి మరో ఇద్దరి ఎస్పీలను అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా?
ఆనాడు తన ఫోన్ ట్యాపింగ్ చేయించినందుకు కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామి రెడ్డి ముగ్గురిపై కూడా కేసులు నమోదు చేయించి ఆ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులను సీబీఐకి అప్పగించి విచారణ జరిపిస్తే నిజాలన్నీ బయటకువస్తాయి,” అని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే ఓటుకి నోటు కేసులో రేవంత్ రెడ్డిని ట్రాప్ చేయగలిగారని అర్దమవుతూనే ఉంది. కానీ భూతంలా వెంటాడుతున్న ఆ కేసు నుంచి రేవంత్ రెడ్డి బయటపడాలనుకుంటారు కానీ ఆ కేసుని చేజేతులా సీబీఐకి అప్పగించరు కదా? అప్పగిస్తే ఏమవుతుందో రఘునందన్ రావుకి కూడా తెలుసు. కానీ తెలియన్నట్లు కేసీఆర్ని కట్టడి చేయాలంటే ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ మాత్రం రాజకీయ జ్ఞానం లేకుండానే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యారా? కేసీఆర్ని ఓడించారా? తెలంగాణ సిఎం కాగలిగారా?