బిఆర్ఎస్ పార్టీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మళ్ళీ ఖమ్మం నుంచి లోక్సభ ఎన్నికలలో పోటీ చేయబోతున్న బిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఒకటి రెండు రోజులలో పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
టిడిపి నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన నేతలలో ఆయన కూడా ఒకరు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీగా ఖమ్మంలోనూ, పార్లమెంట్లో కూడా చక్రం తిప్పారు. బీజేపీలో చేరి ఖమ్మం నుంచే పోటీ చేయవలసిందిగా ఆయనపై బీజేపీ ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే బీజేపీ ఇంతవరకు ఖమ్మం స్థానానికి అభ్యర్ధిని ప్రకటించకుండా పెండింగులో ఉంచిన్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఆయన బీజేపీలోకి జంప్ అయ్యి ఖమ్మం నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీకి దిగితే, బిఆర్ఎస్ పార్టీ రెండు విదాలుగా నష్టపోతుంది. ఆయన వంటి బలమైన నేతని కోల్పోవడం, మళ్ళీ ఆ స్థానంలో ఆయననే ఎదుర్కొని పోరాడవలసి రావడం రెండూ బిఆర్ఎస్ పార్టీకి కష్టమే.
గత కొన్ని రోజులుగా ఈ ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, ఆయన వాటిని ఖండించకపోవడం గమనిస్తే పార్టీ మారడం ఖాయమే అని భావించవచ్చు. త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.