లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో ప్రముఖ మీడియా సంస్థలు ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ, ఏ పార్టీ ఎన్ని ఎంపీ సీట్లు గెలుచుకోగలదో చెపుతున్నాయి. తాజాగా ఇండియా టీవీ-సిఎన్ఎక్స్ సంస్థలు కలిసి తెలంగాణ రాష్ట్రంలో సర్వే చేసి వాటి అంచనాలను ప్రకటించాయి.
వాటి సర్వే ప్రకారం తెలంగాణలోని 17 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ-9, బీజేపీ-5, బిఆర్ఎస్-2, మజ్లీస్ పార్టీ-1 సీటు గెలుచుకోవచ్చని తెలియజేశాయి. ఈసారి లోక్సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్, బీజేపీల నుంచి గట్టి పోటీ ఉంటుందని, కనుక ఎదురీత తప్పదని అందరూ ఊహిస్తూనే ఉన్నారు.
కానీ బిఆర్ఎస్ పార్టీ కనీసం 5-6 ఎంపీ సీట్లు తప్పక గెలుచుకోగలదని అందరూ భావిస్తుంటే ఇండియా టీవీ మాత్రం బిఆర్ఎస్ పార్టీ ఈసారి కేవలం రెండే సీట్లు గెలుచుకోగలదని చెప్పడం చాలా దిగ్బ్రాంతి కలిగిస్తుంది. అయితే ఈ సర్వేలు నిజమయ్యే అవకాశాలు అందుకు బలమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి.
పలువురు బిఆర్ఎస్ పార్టీ నేతలు, సిట్టింగ్, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీలలో చేరిపోతున్నారు. ఆ కారణంగా సరిగ్గా ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ పార్టీ చాలా బలహీనపడుతుండగా, బిఆర్ఎస్ పార్టీలో నుంచి వచ్చిన నేతలలో చాలామందిని కాంగ్రెస్, బీజేపీలు తమ పార్టీ అభ్యర్ధులుగా ప్రకటిస్తుండటంతో వారినే బిఆర్ఎస్ పార్టీ ఎదుర్కోవలసి వస్తోంది. కనుక ఈ పరిణామాలు బిఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం కలిగించవచ్చు.