మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా శాసనసభ, లోక్సభ, స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనుకుంటున్నట్లు చెపుతోంది. కనుక దీనిపై లోతుగా అధ్యయనం చేసేందుకు 2023, సెప్టెంబర్లో మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ నేతృత్వంలో ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
ఆ కమిటీ సభ్యులు ఆరున్నర నెలలపాటు అధ్యయనం చేసి 18,629 పేజీలతో కూడిన ఓ సమగ్రమైన నివేదికని గురువారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతికి అందజేశారు.
దాని ప్రకారం దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలోని 5 ప్రధాన సవరణలు చేయాల్సి ఉంటుందని, దీని కోసం ఉమ్మడి ఓటర్ల జాబితాని రూపొందించాల్సి ఉంటుందని నివేదికల పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై లా కమీషన్ కూడా మరో నివేదికని సిద్దం చేస్తోంది. జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగంలో కొత్తగా ఓ అధ్యాయం చేర్చి, నియమ నిబంధనలు, మార్గదర్శకాలు పేర్కొనాల్సిన అవసరం ఉందని అది కేంద్రానికి సూచించబోతున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఈసారి లోక్సభ ఎన్నికలలో మళ్ళీ ఎన్డీయే కూటమి గెలిచి మళ్ళీ నరేంద్రమోడీ ప్రధాని పదవి చేపడితే, 2029లో జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండవచ్చు. రాజ్యాంగ సవరణలు చేయాలంటే పార్లమెంట్ ఉభయ సభలలో పూర్తి మెజార్టీ చాలా అవసరం. బహుశః అందుకే ఈసారి 400 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని మోడీ, అమిత్ షాలు లక్ష్యంగా పెట్టుకొని ఉండవచ్చు.