ఈ నెల 14-15 తేదీలలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలో మోడీ ప్రభుత్వం వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని అమలులోకి తెస్తూ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
దీనిపై మొదటి నుంచి ప్రతిపక్షాలు అభ్యంతరాలు చెపుతూనే ఉన్నాయి. కాంగ్రెస్తో సహా కొన్ని పార్టీలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేశాయి. దాంతో వెనక్కు తగ్గినట్లు నటించిన మోడీ ప్రభుత్వం, హటాత్తుగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ముందు దీని నోటిఫికేషన్ జారీ చేయడంతో ప్రతిపక్షాలు షాక్ అయ్యాయి.
ఈ సీఏఏ-2019 చట్టం ద్వారా పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి భారత్కు శరణార్దులుగా వచ్చిన ముస్లిమేతరులకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది. హిందువులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, పార్శీ శరణార్ధులకు ఈ చట్టం ద్వారా భారతీయ పౌరసత్వం దాంతో పాటు ఓటు హక్కు లభిస్తుందన్న మాట! వారు బీజేపీకే ఓట్లు వేసే అవకాశం ఉంటుంది కనుకనే దేశంలో బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని భావించవచ్చు.