సిఎం రేవంత్ రెడ్డి శనివారం బైరామల్ గూడా ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతూ, “పాతబస్తీలో మెట్రో కారిడార్-2 పనులు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్దంగా ఉంది.
కానీ ఇక్కడ నుంచి ఒకడు ఢిల్లీ వెళ్ళి మెట్రోని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు నాకు సమాచారం ఉంది. హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడే ఎవరినైనా నగరం నుంచి బహిష్కరించడానికి వెనకాడము. ఇది అధికారిక కార్యక్రమం కనుక ఈ సభలో ఆ వ్యక్తి పేరు చెప్పలేను కానీ మా కాళ్ళలో కట్టెలు పెట్టి మమ్మల్ని అడ్డుకోవాలని చూసే వాళ్ళని ఎవరినీ విడిచిపెట్టము,” అని హెచ్చరించారు.
ఇంతకీ సిఎం రేవంత్ రెడ్డి చెప్పిన ఆ వ్యక్తి ఎవరు? ఏ పార్టీకి చెందినవాడు? పాతబస్తీలో మెట్రో పనులు ప్రారంభం కాక మునుపే అడ్డుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తాడు?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
కాంగ్రెస్ నేతలు ఇటువంటి సాహసానికి పూనుకోరు. ఈ ప్రాజెక్టుకి మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు కనుక మజ్లీస్ నేతలు అడ్డుపుల్లలు వేయరు. ఇక మిగిలింది బిఆర్ఎస్, బీజేపీ నేతలే. రెండు పార్టీలు కూడా సిఎం రేవంత్ రెడ్డి మీద తీవ్ర అసహనంతో రగిలిపోతున్నాయి.
ఆ రెండు పార్టీలలో బీజేపీక్లో కొందరు నేతలు ముస్లింల పట్ల బహిరంగంగానే వ్యతిరేకత ప్రదర్శిస్తూ ఉంటారు. కనుక వారే అడ్డుపుల్లలు వేస్తున్నారా?లేక వేరేవారా? అనే ప్రశ్నకు త్వరలో సిఎం రేవంత్ రెడ్డి సమాధానం చెపుతారు.