ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు సిఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు, మాట్లాడిన మాటలను బిఆర్ఎస్ నేతలు తప్పు పడుతున్నారు. మహబూబ్ నగర్లో నిన్న జరిగిన ప్రజా దీవెన సభలో సిఎం రేవంత్ రెడ్డి వారికి ఘాటుగా సమాధానం చెప్పారు. “దేశాన్ని పాలిస్తున్న ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వస్తే ఆయనను సగౌరవంగా ఆహ్వానించి సాగనంపడం కనీస మర్యాద. అదే మన తెలంగాణ సంస్కృతి కూడా. నేను అదే చేశాను. ఈ అవకాశాన్ని వినియోగించుకొని తెలంగాణకు రావలసిన నిధులు, ప్రాజెక్టులు, ఇతర సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళి వినతిపత్రాలు ఇచ్చాను.
నేను బహిరంగంగానే ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడాను తప్ప కేసీఆర్లాగా రహాస్యంగా ఆయన కాళ్ళ మీద పడలేదు. రాజకీయాలకు అతీతంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య బలమైన సంబంధాలు ఉన్నప్పుడే రాష్ట్రాలు, దాంతో దేశం అభివృద్ధి చెందుతుంది.
నేను తెలంగాణ అభివృద్ధి, ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడితే దానినీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు తప్పు పడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యాయని వితండవాదం చేస్తున్నారు. అంటే నేను కూడా కేసీఆర్లాగ ప్రధాని నరేంద్రమోడీతో కయ్యమాడుతూ తెలంగాణకు నష్టం కలిగించుకోవాలా?” అని ప్రశ్నించారు.