బిఆర్ఎస్, బీఎస్పీలు పొత్తు కుదుర్చుకొని లోక్సభ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈరోజు కేసీఆర్ నివాసంలో రెండు పార్టీల ముఖ్యనేతలు సమావేశమయ్యి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
కేసీఆర్ మాట్లాడుతూ, “బీఎస్పీ అధినేత్రి మాయావతి అనుమతితో ప్రవీణ్ కుమార్ మాపార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు. త్వరలోనే సీట్ల సర్దుబాట్లు చేసుకొని, పూర్తి వివరాలను తెలియజేస్తాము. ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు కనుక ఆయన రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది వారి పార్టీ నిర్ణయించుకుంటుంది,” అని అన్నారు.
ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, “బీజేపీ మతతత్వ రాజకీయాల వలన దేశంలో లౌకికవాదం చాలా ప్రమాదంలో పడింది. బిఆర్ఎస్ పార్టీ లౌకికవాదానికి కట్టుబడి ఉన్నందున, ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని కలిసి పనిచేయాలని నిర్ణయించాము.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలవుతోంది. కానీ ఎన్నికల సమయంలో నిరుద్యోగులతో సహా వివిద వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో చాలా అసంతృప్తిగా ఉన్నారు.
కనుక తెలంగాణలో మళ్ళీ మార్పు రావాలంటే బిఆర్ఎస్, బీఎస్పీలతోనే సాధ్యం. లోక్సభ ఎన్నికలతోనే ఆ మార్పు మొదలవుతుంది,” అని అన్నారు.