తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ త్వరలో ఢిల్లీ వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం బిఆర్ఎస్ పార్టీ ఇంకా ప్రకటించలేదు. కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళుతున్నారు?ఎప్పుడు బయలుదేరుతారు? అక్కడ ఎవరిని కలవబోతున్నారో త్వరలో బిఆర్ఎస్ నేతలే చెప్పవచ్చు. కానీ కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి.
1. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రుల మెడకు అవినీతి కేసులు చుట్టేందుకు సిద్దం అవుతోంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మళ్ళీ కదలికలు మొదలయ్యాయి. కనుక వీటి నుంచి రక్షణ పొందుందుకు ఎన్డీయే కూటమిలో చేరేందుకు సిద్దంగా ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి తెలియజేసేందుకు కావచ్చు. ఎన్డీయే కూటమిలో చేరాలని బీజేపీ పాత, కొత్త మిత్రులను ఆహ్వానిస్తోంది కూడా. కనుక కేసీఆర్ ఈ అవకాశాన్ని వినియోగించుకొని తన సమస్యల నుంచి బయటపడాలని బయలుదేరుతున్నారేమో?
2. ఒకవేళ ఎన్డీయేలో బిఆర్ఎస్ పార్టీ చేరితే లోక్సభ ఎన్నికలలో బీజేపీతో సీట్ల సర్దుబాట్ల గురించి చర్చించేందుకు.
3. లోక్సభ ఎన్నికలలో బీజేపీని ఇండియా కూటమి ఎదుర్కొలేదని, ఆమాద్మీ (ఢిల్లీ, పంజాబ్), తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (పశ్చిమ బెంగాల్), బిఆర్ఎస్ (తెలంగాణ) వంటి బలమైన ప్రాంతీయ పార్టీలు కలిసి ఎదుర్కోగలవని కేసీఆర్ భావిస్తున్నారు. కనుక ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్ని కలిసి మళ్ళీ ‘థర్డ్ ఫ్రంట్’ ఏర్పాటు గురించి చర్చించేందుకు కేసీఆర్ ఢిల్లీ బయలుదేరుతున్నారేమో?