తెలంగాణ సెంటిమెంట్ గుర్తించకుండా మూడేళ్ళపాటు రాష్ట్రంలో రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ చెవులు హోరెత్తించేసిన వైఎస్ షర్మిల, తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేసి ఏపీకి వెళ్ళిపోయారు.
దీంతో తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు, రాజకీయ పార్టీలకు కూడా ఆమె నుంచి విముక్తి లభించిన్నట్లయింది. కానీ నేడు ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించడంతో, నేటి నుంచి ఏపీ ప్రజలకు అన్నా చేల్లెల్ల మద్దెల దరువు మొదలైపోయింది.
ఇద్దరి రాజకీయ మూలాలు కాంగ్రెస్లోనే ఉన్నాయి. ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు. ఇద్దరూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి భజనే చేస్తుంటారు. కానీ ఇక నుంచి ఇద్దరూ పరస్పరం విమర్శించుకోవడం మొదలుపెడితే ఏపీలో మరో సరికొత్త ‘రాజకీయ ఫ్యామిలీ డ్రామా’ మొదలవుతుంది.
ఈరోజు ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడుతూనే అన్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి దోచుకొని తినేస్తున్నాడని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె సొంత చెల్లెలే అయినప్పటికీ తన పార్టీకి, ప్రభుత్వానికి, అధికారానికి ఎసరు పెట్టబోతున్నారు కనుక వైసీపి నేతలు కూడా ఎదురుదాడి ప్రారంభించవచ్చు. తెలంగాణ ప్రజలకు అన్నాచెల్లెళ్ళ నుంచి విముక్తి లభించింది. కానీ ఏపీ ప్రజలు వారికి బలైపోతున్నారు... పాపం!