తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ సదస్సులో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీతో భేటీ అయ్యి, తెలంగాణలో రూ.12,400 కోట్ల పెట్టుబడికి ఆయనతో ఒప్పందం చేసుకున్నారు.
దీనిపై మాజీ పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, “ఎన్నికలకు ముందు అదానీని కాంగ్రెస్ నేతలందరూ తిట్టిపోసేవారు. ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు దేశాన్ని దోచిపెడుతున్నారని తీవ్ర విమర్శలు చేసేవారు.
కానీ ఇప్పుడు దావోస్ పర్యటనలో అదే అదానీతో రేవంత్ రెడ్డి బృందం భేటీ అయ్యి, ఆయన సంస్థతో ఒప్పందాలు చేసుకున్నారు. ఆయనతో అలయ్ బలాయ్ అవుతున్నారు. కాంగ్రెస్, బీజేపీల మద్య అదానీ వారధిలా పనిచేస్తున్నారని, ఆ రెండు పార్టీల మద్య రహస్య అవగాహన ఉందని దీంతో స్పష్టమవుతోంది,” అని ఆరోపించారు.
కేటీఆర్ వాదన సహేతుకంగానే ఉంది కానీ అదానీ గ్రూప్ రాష్ట్రంలో రూ.12,400 కోట్లు పెట్టుబడి పెట్టడాన్ని సమర్ధిస్తారా లేక ఆయనకు ప్రధాని నరేంద్రమోడీతో సంబంధాలు ఉన్నాయి కనుక వద్దంటారా?
కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కు అయ్యాయని వితండవాదం చేస్తున్న కేటీఆరే మొన్న శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యేలతో కలిపి మాకు 54 మంది ఉన్నారని అన్నారు కదా?అంటే బిఆర్ఎస్, బీజేపీల మద్య రహస్య అవగాహన ఉన్నట్లే కదా?