మాజీ సిఎం కేసీఆర్ 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళడంతో ఆయన పుణ్యమాని శాసనసభ ఎన్నికలలో ఓడిపోయినవారికి లోక్సభ ఎన్నికలు మరో అవకాశంగా కలిసి వస్తున్నాయి. బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే లోక్సభ నియోజకవర్గాలవారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించుకుంటూ ఆ ఎన్నికలకు సిద్దమవుతోంది.
కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎటువంటి హడావుడి చేయడం లేదు కానీ ఇప్పటికే అభ్యర్ధుల జాబితా కాంగ్రెస్ అధిష్టానం చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో కూడా లోక్సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే అంతర్గత సమావేశాలు నిర్వహించుకుంటూ అభ్యర్ధులను ఖరారు చేసుకునే పనిలో ఉంది.
ఈసారి శాసనసభ ఎన్నికలలో గజ్వేల్, హుజూరాబాద్ రెండు చోట్ల ఓడిపోయిన ఈటల రాజేందర్ దృష్టి మల్కాజ్గిరిపై పడిన్నట్లు తెలుస్తోంది. బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్ రావు, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ కూడా మల్కాజ్గిరి నుంచే లోక్సభకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
మల్కాజ్గిరి నియోజకవర్గంలో దేశంలో అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉన్నందున అక్కడ తెలంగాణ సెంటిమెంట్ కంటే, మోడీ మంత్రం, బీజేపీ హిందుత్వ అస్త్రంమే బాగా పనిచేస్తుంది. కనుక అక్కడి నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల ఒత్తిడి తక్కువగా ఉంటుందని భావిస్తుండటమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.
అయితే ఈటల రాజేందర్ సలహాలు, పిర్యాదులు పాటించి బండి సంజయ్ని తొలగించుకున్నందునే శాసనసభ ఎన్నికలలో బీజేపీ ఓడిపోయిందని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కనుక ఆయనకు టికెట్ నిరాకరించి ఆర్ఎస్ఎస్ నేపధ్యం, మద్దతు ఉన్న మురళీధర్కు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఖరారు చేసే అవకాశం ఉంది.