కేసీఆర్‌-కేంద్రం మద్య నరసింహన్ మద్యవర్తిత్వం చేస్తున్నారటగా!

October 28, 2022


img

ఆంధ్రప్రదేశ్‌ తెలుగుదేశ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఈరోజు నలుగురు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంలో తెలంగాణ మాజీ గవర్నర్‌ నరసింహన్ కేసీఆర్‌-కేంద్ర ప్రభుత్వం మద్య మద్యవర్తిత్వం చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కల్వకుంట్ల కవితను మీరు వదిలేస్తే, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మేము వదిలేస్తాం అని కేసీఆర్‌- అమిత్‌ షాల మద్య బేరసారాలు సాగుతున్నాయని గౌతు శిరీష పేర్కొన్నారు. “పాత కాలంలో వస్తు మార్పిడి ఉండేది అని ఆర్థికశాస్త్రములో చదువుకున్నాం. ఇప్పుడు నేరాలు మార్పిడి ఇలా ఉంటుంది... మీ నేరానికి మా నేరం చెల్లు... అని చెప్తున్న ప్రస్తుత రాజకీయ శాస్త్రం. నిజమే! దేశం బాగా అభివృధి చెందింది. ఒప్పుకుంటున్నాను,” అని హెడ్డింగ్ పెట్టారు. 

ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అడ్డంగా ఇరుక్కుపోయిన బిజెపి పెద్దలు, లేదా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నుంచి కుమార్తెను బయటపడేసేందుకు కేసీఆర్‌ ఎవరో ఒకరు మాజీ గవర్నర్‌ నరసింహన్ ద్వారా మద్యవర్తిత్వం చేయడం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాబోదు. గతంలో ఓటుకి నోటు కేసులో చంద్రబాబు నాయుడు, టెలీఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్‌ చిక్కుకుపోయినప్పుడు నరసింహన్, మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మద్యవర్తిత్వం వహించి ఇరువర్గాలకు రాజీ కుదిర్చారని, అందుకే ఆ కేసు అటకెక్కిపోయిందని ఊహాగానాలు వినిపిస్తుంటాయి. కనుక కేసీఆర్‌ ఎంతో గౌరవించే నరసింహన్ ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మద్యవర్తిత్వం చేస్తుండటం నిజమే అయ్యుండవచ్చు. బహుశః అందుకే టిఆర్ఎస్‌ నేతలందరినీ కేసీఆర్‌ ‘సైలెంట్ మోడ్‌’లో పెట్టారేమో?  కనుక ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు, ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తాలూకు ఫైల్స్ కూడా అటక మీద ఓటుకి నోటు కేసు ఫైల్స్ పక్కన పెట్టేసినా ఆశ్చర్యం లేదు!




Related Post