కేసీఆర్‌కు హరీష్‌ రావుకు మద్యన ఏవైనా గొడవలున్నాయేమో?

September 30, 2022


img

ఏపీలో ఉపాధ్యాయులను జగన్ ప్రభుత్వం వేదిస్తోందంటూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలతో రెండు రాష్ట్రాల మద్య మళ్ళీ మాటల యుద్ధం ప్రారంభమైంది. ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఈరోజు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, “హరీష్‌ రావు మా ప్రభుత్వం గురించి ఆవిదంగా ఎందుకు అన్నారో కానీ అది చాలా తప్పు. ఆయనకి సిఎం కేసీఆర్‌కి మద్య ఏవైనా విభేధాలున్నాయోమో తెలీదు. ఏపీలో టిడిపి, దాని అనుకూల మీడియా మా ప్రభుత్వంపై చేస్తున్నటువంటి విమర్శలనే మంత్రి హరీష్‌ రావు కూడా చేస్తున్నందున, టిఆర్ఎస్‌కు ఏపీ రాజకీయాలలో ఆసక్తి చూపుతోందా?అనే అనుమానం కలుగుతోంది. 

మంత్రి హరీష్‌ రావు ఇటీవల మా ప్రభుత్వం గురించి అనవసరమైన మాటలు చాలా మాట్లాడారు. మేము మోటర్లకు మీటర్లు పెడితే మీకెందుకు? మీరు పెట్టుకోకపోతే మాకెందుకు?ఆయన రెండు రాష్ట్రాల మద్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఏమైనా చొరవ చూపితే బాగుండేది. కానీ ఈవిదంగా మా ప్రభుత్వాన్ని తద్వారా మా అధినేతను కించపరిచేవిదంగా మాట్లాడి ఏం ప్రయోజనం? మీరు మమ్మల్ని తిడితే మళ్ళీ మేము మిమ్మల్ని తిడితే ఉపఎన్నికలలో మీకేమైనా సానుభూతి ఓట్లు పడతాయని భావిస్తున్నారేమో తెలీదు. 

మీ రాష్ట్రం, మీ ప్రభుత్వం గురించి మాట్లాడాటలంటే మేము కూడా మాట్లాడలేమా?కానీ ఇటువంటి అనవసర వివాదాలు వద్దని మా సిఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తుంటారు. అందుకే  మేమేనాడూ తెలంగాణ విషయాలలో తలదూర్చలేదు. ఎవరినీ పల్లెత్తుమాటనలేదు. కనుక ఇకనైనా తెలంగాణ మంత్రులు హద్దు మీరకుండా ఉంటే అందరికీ మంచిది,” అని హితవు పలికారు. 



Related Post