ఇప్పటికే సిఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు పరస్పరం కత్తులు దూసుకొంటున్నారు. అలాగే రాష్ట్రంలో టిఆర్ఎస్, బిజెపిల మద్య యుద్ధవాతావరణం నెలకొని ఉంది. ఒకరి ఫ్లెక్సీ బ్యానర్లను మరొకరు చింపుకోవడం, ఒకరి సభలకు మరో అడ్డుపడుతూ రోడ్లపై కొట్టుకొనే స్థాయికి దిగజారారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించినందున ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరుగబోయే ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ అమిత్ షా ఒకరోజు ముందుగా హైదరాబాద్ చేరుకొనున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అమిత్ షా, బిజెపి నేతలు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగకమానరు.
సికింద్రాబాద్లో నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి పోటీగా తెలంగాణ ప్రభుత్వం అదే రోజున జాతీయ సమైక్య దినోత్సవం నిర్వహించబోతోంది. కనుక ఆ సభలో కేసీఆర్ కూడా కేంద్ర ప్రభుత్వంపై మళ్ళీ నిప్పులు చెరుగకమానరు. అమిత్ షా రాకతో తెలంగాణలో టిఆర్ఎస్, బిజెపిల మద్య జరుగుతున్న యుద్ధం మరింత భీకరంగా మారబోతోంది. మునుగోడు ఉపఎన్నికలు వాటి యుద్ధానికి వేదికగా మారబోతోంది.