రైతులు వ్యతిరేకిస్తున్న కారణంగా మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించి, వారికి క్షమాపణలు కూడా చెప్పారు. కనుక తక్షణమే ఢిల్లీ సరిహద్దులో ఉన్న రైతులందరూ స్వగ్రామాలకు తరలివెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కానీ ఆ మూడు చట్టాలను పార్లమెంటులో రద్దు చేసిన తరువాతే తాము గ్రామాలకు తిరిగి వెళతామని అప్పటి వరకు సింఘూ సరిహద్దు వద్దే ఉంటామని రైతు సంఘాల ప్రతినిధులు తేల్చి చెప్పారు.
ఢిల్లీ శివారులోని సింఘూ సరిహద్దు వద్ద వేలాది రైతులు ఏడాదిగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్రప్రభుత్వం వారిని పట్టించుకోకపోవడం ఎంత తప్పో, ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా రైతులకు క్షమాపణలు చెప్పి వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించిన తరువాత కూడా రైతులు ఆందోళనలు విరమించకపోవడం ఇంకా తప్పు. వారు ఈవిదంగా చేయడం వలన వారు రాజకీయ దురుదేశ్యంతోనే ఆందోళనలు చేస్తున్నారనే బిజెపి వాదనలకు బలం చేకూర్చినట్లవుతుంది.