తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రవేశించినప్పటి నుంచి రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రతీరోజు రాష్ట్రంలో కరోనా పరిస్థితిని తెలియజేస్తూ తన అధికారిక వెబ్సైట్లో నివేదికలు పెడుతుండేది. కానీ గత మూడు రోజులుగా వెబ్సైట్లో నివేదికలు పెట్టడం లేదు. దేశంలో పలు రాష్ట్రాలతో సహా తెలంగాణలో కూడా మళ్ళీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నపుడు, తాజా పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు నివేదికలు జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేయవలసి ఉండగా ఎందుకో నివేదికలు పెట్టడం నిలిపివేసింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తీవ్రత మళ్ళీ ఏమేరకు పెరిగింది? ఏఏ జిల్లాలలో కరోనా తీవ్రత ఎక్కువగా లేదా తక్కువగా ఉంది? కొత్తగా ఎంతమందికి కరోనా బారినపడుతున్నారు?ఎంతమంది కొలుకొంటున్నారు?వంటి విషయాలు ప్రజలకు తెలిసే అవకాశం లేకుండా పోయింది. అసలు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రతీరోజు కరోనా నివేదికలు జారీ చేయడం ఎందుకు నిలిపివేసింది? రాష్ట్రంలో మళ్ళీ కరోనా తీవ్రత పెరిగినందున గోప్యత పాటిస్తోందా లేక వేరేమైనా కారణాలున్నాయా?తెలియవలసి ఉంది.