రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఈరోజు కీలక ప్రకటన చేశారు. ఈరోజు తెలంగాణ భవన్లో రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం ప్రతినిధులతో సమావేశమైనప్పుడు మాట్లాడుతూ, ఒకటి రెండు రోజులలోగా సిఎం కేసీఆర్ నిరుద్యోగ భృతిపై ప్రకటన చేయబోతున్నారు. త్వరలో వివిద శాఖలలో 50,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి,” అని తెలిపారు.
డిసెంబర్ 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో నిరుద్యోగులకు నెలకు రూ.3,016 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని సిఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ రెండేళ్ళు గడిచిపోయినా ఇంతవరకు ఆ హామీ నెరవేర్చలేదు. గత ఏడాది ఈ హామీని అమలుచేద్దామనుకొన్నాము కానీ లాక్డౌన్ కారణంగా పరిస్థితులు తారుమారు అయ్యాయని, ఆ తరువాత వరుసగా వరదలు...జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చేశాయని కనుక ఎన్నికలు ముగిసిన తరువాత నిరుద్యోగ భృతిపై నిర్ణయం తీసుకొంటారని చెప్పారు. ఇవాళ్ళ మంత్రి కేటీఆర్ స్వయంగా నిరుద్యోగ భృతిపై సిఎం కేసీఆర్ ప్రకటన చేస్తారని చెప్పారు కనుక త్వరలోనే ప్రభుత్వం ఆ హామీని అమలుచేసే అవకాశం ఉంది.