అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ బుదవారం ఉదయం వాషింగ్టన్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన ఎన్నికను వ్యతిరేకిస్తున్న ట్రంప్ మద్దతుదారులు విధ్వంసం సృష్టించవచ్చని నిఘా వర్గాల హెచ్చరికల నేపధ్యంలో వాషింగ్టన్ నగరమంతటా భారీగా నేషనల్ గార్డ్స్ (భద్రతాదళాలు)ను మోహరించింది ప్రభుత్వం. ఇతర రాష్ట్రాలలో కూడా ట్రంప్ మద్దతుదారులు విధ్వంసానికి పాల్పడవచ్చనే హెచ్చరికలతో అన్ని రాష్ట్రాలలో ముఖ్యమైన ప్రాంతాలలో భద్రతాదళాలను మోహరించారు. కానీ వీటన్నిటికంటే భద్రా సిబ్బందిని, అధికారులను, జో బైడెన్ వర్గానికి ఆందోళన కలిగిస్తున్న విషయం మరొకటి ఉంది. భద్రతాదళాలలో ఉన్న ట్రంప్ మద్దతుదారులు కూడా కాల్పులకు తెగబడే ప్రమాదం ఉందనే హెచ్చరికలతో అందరూ తీవ్ర ఆందోళనతో ఉన్నారు. దీంతో జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయబోయే వాషింగ్టన్లో సుమారు 25,000కు పైగా భద్రతాదళాలను మోహరించడంతో పండుగ వాతావరణం నెలకొనవలసిన ఈ సమయంలో నగరంలో యుద్ధవాతావరణం కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో వాషింగ్టన్తో సహా దేశవ్యాప్తంగా పలు నగరాలలో హోటల్స్, దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు.
అధ్యక్షుడి ప్రమాణస్వీకారమంటే అమెరికన్లకు ఓ పండుగలా భావిస్తుంటారు కనుక ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాదిమంది ప్రజలు తరలివచ్చి ఈ వేడుకలో ఆనందోత్సాహలతో పాల్గొంటారు. గతంలో 2 లక్షలకు పైగా ప్రజలు పాల్గొన్న సందర్భాలున్నాయి. కానీ ఈసారి కేవలం 1,000 మంది ముఖ్య అతిధులను మాత్రమే అనుమతిస్తున్నారు.