మన ఇరుగు పొరుగు దేశాలలో అత్యధికంగా పాకిస్థాన్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత నెల 8వ తేదీన 4,005 పాజిటివ్ కేసులు నమోదు కాగా నేటికీ అవి 25,837కి చేరాయి. వాటిలో అత్యధికంగా పంజాబ్ ప్రావిన్సులో 10,033, సింధ్లో 9,093, పాక్ ఆక్రమిత కశ్మీర్లో 78 కేసులు నమోదయ్యాయి.
గడచిన 24 గంటలలో పాకిస్థాన్లో 1,764 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 7,530 మంది కోలుకోగా 594 మంది కరోనాతో మృతి చెందారు.
ఇప్పటికే ఉగ్రవాదం, నిరుద్యోగం, పేదరికం, ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న పాకిస్థాన్ అమెరికా, సౌదీ అరేబియా వంటి కొన్ని దేశాలు అందిస్తున్న ఆర్ధికసాయంతో అతికష్టం మీద నెట్టుకొస్తోంది. ఇప్పుడు ఈ కరోన మహమ్మారి కూడా కబళించివేస్తుండటంతో పాక్ పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశం ఉంది. కానీ ఇటువంటి గడ్డు పరిస్థితులలో కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుండటం విశేషమే.