ఔరంగాబాద్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైల్వే పట్టాలపై నిద్రిస్తున్న వలస కార్మికులపై నుంచి గూడ్స్ రైలు దూసుకుపోవడంతో 15 మంది చనిపోయారు. ఈ విషాదఘటన శుక్రవారం తెల్లవారుజామున సుమారు 5.15 గంటలకు మహారాష్ట్రలోని జౌరంగాబాద్-జల్నా మార్గంలో జరిగింది. చనిపోయినవారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం మృతులు అందరూ మహారాష్ట్రలోని జల్నాలో ఓ ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్నారు. లాక్డౌన్తో కర్మాగారం మూతపడటంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ కర్మాగారం తెరుచుకొంటుందనే ఆశతో ఇన్ని రోజులు ఓపికగా ఎదురుచూసినవారు లాక్డౌన్ పొడిగింపుతో తీవ్ర నిరాశనిస్పృహలకు గురయ్యారు. మధ్యప్రదేశ్లో తమ స్వస్థలాలకు కాలినడకన బయలుదేరారు.
అయితే రైలు పట్టాల పక్కన కాలిబాటలో నడుచుకొంటూ వెళ్లాలనుకోవడమే వారికి శాపంగా మారింది. లాక్డౌన్ కారణంగా ఎలాగూ రైళ్లు తిరగడం లేదు కదా అనుకొని అందరూ నిన్న రాత్రి పట్టాలపై పడుకొన్నారు. అయితే సరుకు రవాణా చేసే గూడ్స్ రైళ్లు తిరుగుతున్నాయనే సంగతి వారికి తెలియకపోవడంతో ఈ విషాదఘటన జరిగింది. ఏకధాటిగా 45కిమీ నడిచి అలిసిపోయిన వారందరూ పట్టాలపై అదమరిచి నిద్రిస్తున్న సమయంలో ఈరోజు తెల్లవారుజామున వారిపై నుంచి గూడ్స్ రైలు దూసుకుపోవడంతో అందరూ చనిపోయారు. చెల్లాచెదురుగా పడి ఉన్న శరీర అవయవాలతో.. రక్తంతో దాంతో ఆ ప్రాంతంలో చాలా భయానకంగా ఉంది.
సమాచారం అందుకొన్న రైల్వే, జిల్లా పోలీసులు,, అధికారులు, సిబ్బంది హుటాహుటిన అక్కడకి చేరుకొని చనిపోయినవారిని తరలించారు.